న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో ఈ బిల్లుకు సంబంధించిన పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజరుకుమార్, కె.వి విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
కాగా, ఎఐఎంఐఎం, ఆప్, టిఎంసి, డిఎంకె, టివికె, వైఎస్సార్సిపి, సిపిఐ, ఆర్జెడిలతోపాటు ఇతర కొన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఏప్రిల్ 7వ తేదీన ఈ పిటిషన్లను విచారణ జాబితాలో చేర్చాలని ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ పేర్కొన్నారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టాన్ని కొట్టేసినా, లేదా మార్చినా పరిపాలన, చట్టపరమైన పరిణామాలను ఎత్తిచూపుతూ.. బిజెపి పాలిత ఆరు రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాంలు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి.
