చెన్నయ్ : కేరళకు అండగా ఉంటామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజయన్కు బరోసా ఇచ్చారు. సీఎం నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 20 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది వైద్యులతో కూడిన వైద్య బందాన్ని కేరళకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కేరళ విషాదంపై పార్లమెంట్లో చర్చకు నిరాకరణ
కేరళ విషాదంపై చర్చిండానికి కేంద్ర ప్రభుత్వానికి మనసురాలేదు. రాజ్యసభలో చర్చకు చైర్మన్ జగదీప్ ధనఖర్ అనుమతి ఇవ్వలేదు. పైగా దీనిపై చర్చ అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో కేరళకు చెందిన సిపిఎం, సిపిఐ, కేరళ కాంగ్రెస్ ఎంపిలు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ కూడా చైర్మన్ చర్చకు అనుమతి ఇవ్వకుండా దాట వేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రితో ప్రధాని మాట్లాడారని, ఈ దుర్ఘటనతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయిందని, ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాయని, ఇంక ఈ అంశంపై చర్చించడానికి ఏమి మిగిలి ఉందని అన్నారు. అయితే పెను విషాదం జరిగిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చకు అనుమతించాలని ఎంపిలు డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపిలకు మాట్లాడేందుకు చైర్మన్ ధంఖర్ అవకాశం కల్పించారు.