- ట్రంప్ టారిఫ్ల ఊసే లేదు
- లెక్కలేని రూపాయి పతనం..
- ఎఐపై విస్మరణ
- మరోవైపు పని గంటల పెంపు
- జిడిపి పెరుగుదలకు చర్యలు శూన్యం
- ఎకనామిక్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక స్థితికి అద్దం పట్టే అధికారిక వార్షిక నివేదిక ఎకనామిక్ సర్వేలో అనేక సవాళ్లను మోడీ సర్కార్ విస్మరించింది. అంతర్జాతీయంగా ట్రంప్ టారిఫ్ల పెంపు, ఎగుమతుల పతనం, వాణిజ్య లోటు సమస్యలకు పరిష్కారం చూపలేదు. మరోవైపు రికార్డ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువపై లెక్కలేని తనంగా వ్యవహరించింది. ఎకనామిక్ సర్వేలో ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలను పొందుపర్చాలి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రధాన మార్పులు, పరిణామాల్ని చెప్పి.. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో మార్గదర్శనం చేయాలి. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. విదేశీ భౌగోళిక, ఆర్ధిక పరిణామాల ప్రభావం, ప్రభుత్వ విధాన నిర్ణయాలను విశ్లేషించాలి. దీని ఆధారంగానే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంటుంది. దీనికి భిన్నంగా దిశానిర్దేశం లేని ఎకనామిక్ సర్వేను బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేలో అనేక సవాళ్లు, పరిష్కారాలకు నీళ్లు వదిలేశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25లో జిడిపి 6.4 శాతానికి పడిపోయి.. నాలుగేళ్ల కనిష్టానికి చేరొచ్చని అంచనా వేసిన ఆర్ధిక సర్వే.. వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించలేదు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత్పై సుంకాలను పెంచుతామని బహిరంగంగా ప్రకటించారు. డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డ్ స్థాయిలో 87కి చేరువలో పతనమయ్యింది. ఎగుమతులు పతనం అవుతున్నాయి. వాణిజ్య లోటు పెరుగుతోంది. అనేక రంగాలు మౌలిక వసతుల సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు, అసంఘటిత రంగం కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల, మందగిస్తున్న పరిశ్రమల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గాలను ఆర్ధిక సర్వే గట్టున పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల్ని విస్మరించింది. అమెరికా, చైనా లాంటి దేశాలు కృత్రిమ మేధ (ఎఐ)లో పోటీ పడుతూ.. ఈ రంగంలో దూసుకుపోతుండగా.. టెక్నాలజీలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులున్న భారత్ వెనుకబాటుపై వివరణ ఇవ్వలేదు. దేశం మెరుగైన వృద్ధి రేటును సాధించకుండా నిరుద్యోగం తగ్గిందని ఎకనామిక్ సర్వేలో ప్రకటన చేయడం నిపుణులను విస్మయానికి గురి చేస్తోంది.
రోజుకు 10 గంటల పని..!
ఎకనామిక సర్వేలో కార్మిక వ్యతిరేక విధానాలు కొట్టిచ్చినట్లు కనబడ్డాయి. ఇటీవల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని తొలుత కొత్త పాట అందుకోగా.. దీనికి కొనసాగింపుగా… ఎల్అండ్టి ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఏకంగా 90 గంటల పని చేయాలని.. అంటే రోజుకు 12 గంటలు శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నయా బానిస విధానంపై తీవ్ర చర్చ జరిగుతున్న వేళ కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేలో ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. వారానికి 60 గంటల వరకూ పని విధానం పర్వాలేదంటూ కొత్త పాట అందుకుంది. అంటే వారంలో ఒక్క రోజు సెలవు పోయినా.. మిగితా దినాల్లో రోజుకు సగటున 10 గంటల పని చేయాలని ప్రతిపాదించినట్లయ్యింది. కార్మిక చట్టాల ప్రకారం.. వారానికి 48 గంటలు పని మించకూడదు. కాగా.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తేనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. రోజుకు 12 గంటలు పని చేయడం ద్వారా అనారోగ్యం పాలవుతారని తెలిపింది. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం అంటూనే 60 గంటల పని విధానాన్ని ప్రతిపాదించడం కార్పొరేట్ శక్తుల మెప్పు పొందేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు.