న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఢిల్లీలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ తరపునన బరిలో దిగనున్న మొత్తం 15 మంది అభ్యర్థుల జాబితాను ఆర్పీఐ విడుదల చేసింది. న్యూఢిల్లీ నుంచి శుభి సక్సేనా, పాలం నుంచి వీరేందర్ తివారీ, మాలవీయనగర్ నుంచి రాంనరేష్ నిషాద్ బరిలో దిగబోతున్నారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రస్తుతం నామినేషన్ల దాఖలు కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. ఈ నెల 18న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడువు ఉంది.