- రాజ్నాథ్కు జెండా, గులాబీ అందచేసిన రాహుల్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అదానీ ముడుపుల వ్యవహారంపై చర్చ కోసం పట్టుపడుతున్న ప్రతిపక్షాలు బుధవారం వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించాయి. పార్లమెంటు ఆవరణలో నిల్చొని సభకు హాజరవుతున్న బిజెపి ఎంపిలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడకు రావడంతో రాహుల్ గాంధీ గబగబా వెళ్లి ఆయన చేతికి త్రివర్ణ పతాకం, గులాబీ ఇచ్చి తన నిరసన తెలిపారు. ‘అదానీ’ అంశంపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కాంగ్రెస్-సోరోస్ సంబంధాలను తీసుకొచ్చి సభా కార్యక్రమాలను సాగనీయకుండా బిజెపి అడ్డుపడుతోందని ప్రతిపో నేతలు విమర్శించారు.
ప్రతిపక్షాల ఆందోళనల నడుమ రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ప్రతిపక్ష ఎంపిల ఆందోళనల మధ్య రైల్వే సవరణ బిల్లును లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన రైల్వే సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ఆమోదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే రైల్వేల ప్రైవేటీకరణకు దారితీస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో రైల్వేల ప్రైవేటీకరణ జరగదని, రైల్వే బోర్డు పనితీరు మెరుగుపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
సభను సజావుగా నడపండి : లోక్సభ స్పీకర్కు రాహుల్ గాంధీ వినతి
పార్లమెంటులో తనపై బిజెపి ఎంపీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కోరారు. బుధవారం పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, బిజెపి సభ్యులు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని. స్పీకర్ను తాను కోరానని అన్నారు. సభ సజావుగా జరగాలన్నదే మా లక్ష్యం. చర్చ జరగాలి. బిజెపి నాయకులు తనకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనీయండి. డిసెంబర్ 13న రాజ్యాంగ చర్చ జరగాల్సిందే. వాళ్లు అదానీపై చర్చకు ససేమిరా అంటున్నారు. వాళ్లు మాపై ఆరోపణలు చేసుకోనీయండి, కానీ సభ మాత్రం జరగాలని రాహుల్ అన్నారు.
‘ద్రోహి’ వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్
కాగా, రాహుల్ గాంధీని ‘ద్రోహి’ అంటూ సంబిత్ పాత్ర సంబోధించడాన్ని ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాందీ, రాజీవ్గాంధీలను సైతం ద్రోహులుగా మాట్లాడిన వ్యక్తులు రాహుల్ గాంధీని విడిచిపెడతారని తాము అనుకోలేమని, వాళ్లకు ఇదేమీ కొత్త కాదని అన్నారు. అయితే రాహుల్ గాంధీకి అన్నింటి కంటే దేశమే ఎక్కువని, ఆయనను చూసి తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వమే (పార్లమెంటు కార్యకలాపాలకు) అంతరాయం కలిగించడం ఇది సిగ్గుపడాల్సిన విషయమని ఇది తాను మొదటిసారి చూస్తున్నానని విమర్శించారు.