ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని కుల ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థను రైలు బోగీల్లాంటివని సుప్రీంకోర్టు అభివర్ణించింది. మంగళవారం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒబిసి రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ రిజర్వేషన్లను ”రైలు కంపార్ట్మెంట్”తో పోల్చారు. రైలు బోగీల్లో అప్పటికే సీట్లు పొందిన వ్యక్తులు ఇతరులు ప్రవేశించకూడదని కోరుకుంటారని, రిజర్వేషన్లు పొందిన వ్యక్తులు, సమాహాలు కూడా ఇతరులకు రిజర్వేషన్లు దక్కకూడదని అనుకుంటారని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
మంగళవారం వాదనలో మహారాష్ట్రలో రాజకీయంగా వెనుకబడిన, సామాజికంగా వెనుకబడిన తరగతులను గుర్తించాలని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. బాంథియా కమిషన్ ఒబిసిలు రాజకీయంగా వెనుకబడినవారని చెప్పకుండానే వారికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిందని శంకరనారాయణన్ అన్నారు. ఒబిసిలకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ, దానిని ప్రభుత్వం ఉపయోగించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏకపక్షంగా నడుపుతోందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందేందుకు ఒబిసిలలోనే వెనకబడిన వారిని గుర్తించాలని వాదించారు. దీనిపై జోక్యం చేసుకున్న జస్టిస్ సూర్యకాంత్ ”విషయం ఏమిటంటే, ఈ దేశంలో రిజర్వేషన్ వ్యాపారం రైల్వే లాగా మారింది. కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన వారు మరెవరూ ప్రవేశించకూడదని కోరుకుంటారు. అదే మొత్తం ఆట. పిటిషనర్ కూడా అదే ఆట” అని అన్నారు. రిజర్వేషన్ల ప్రయోజనాలను కోల్పోకుండా చూడ్డానికి ప్రభుత్వాలు మరిన్ని తరగతులను గుర్తించాల్సిన అవసరం ఉందని, ఈ వర్గీకరణ ఒక నిర్దిష్ట కుటుంబం లేదా సమూహాలకు పరిమితం కాకూడదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు 2016-17లో జరిగాయి. అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఈ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఒబిసి అభ్యర్థుల కోటాపై జరిగిన న్యాయ పోరాటం. ఒబిసిలకు 27 శాతం కోటా అమలు చేయడానికి 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల్లో వెనుకబాటుతనం చిక్కులను విచారించడానికి ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని పేర్కొంది. మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ను 4 వారాల్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒబిసి రిజర్వేషన్ల సమస్య కారణంగా మహారాష్ట్రలో చాలా కాలంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను మరింత ఆలస్యం చేయలేమని ధర్మాసనం పేర్కొంది. 2022 నివేదికకు ముందు రాష్ట్రంలో ఉన్న విధంగా ఒబిసి వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వబడతాయి.
