న్యూఢిల్లీ : సీఈసీ, ఈసీల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 14వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. ఓ పిటిషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఈ విషయంలో త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై వచ్చే నెలలో విచారణ జరపనుంది. అదేరోజు భూసేకరణతో పాటు అనేక ఇతర కీలకమైన కేసులను ఈ రోజు ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
కాగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ 2023లో కేంద్రం చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.