న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా ముస్లింలపై ద్వేషం కలిగేలా సోషల్ మీడియా వ్యాప్తంగా పుకార్లు వైరలవుతున్నాయి. కొందరు ఉద్దేశపూర్వకంగా ముస్లిం సమాజంపై విద్వేషాన్ని వెదజల్లుతున్నారు. వాస్తవానికి పలువురు ముస్లింలు తమ ప్రాణాలను పణంగా పెట్టి దాడి నుండి హిందూ కుటుంబాలను రక్షించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన రోజు నజకత్ అలీ మొత్తం నాలుగు కుటుంబాలకు చెందిన 11 మందిని రక్షించారు. ప్రతి ఏడాది శీతాకాలంలో ఛత్తీస్గఢ్లోని చిరిమిరి అనే చిన్న గ్రామంలో కాశ్మీరీ షాల్స్ విక్రయిస్తూ నజకత్ అలీ గడుపుతుంటాడు. ఆ సమయంలో స్థానిక కుటుంబాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దీ ఆ గ్రామం నుండి నాలుగు కుటుంబాలు కాశ్మీర్లో పర్యటించేందుకు వచ్చారు. ఏప్రిల్ 16న జమ్ము చేరుకున్న వారిని సాదరంగా ఆహ్వానించాం. శ్రీనగర్, గుల్మార్గ్ తీసుకువెళ్లాం. తమ ఇంటికి విందుకి ఆహ్వానించడంతో.. పర్యటనలో చివరి రోజు పహల్గాం వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్ 21 రోజు రాత్రి హోటల్లో బస చేసి, మరుసటి రోజు పహల్గాం చేరుకున్నాం.
ఏప్రిల్ 22న వారంతా బైసరన్ వ్యాలీలో పర్యటిస్తున్న సమయంలోనే ఉగ్రదాడి జరిగింది. పిల్లలతో ఆడుకుంటుండగా .. కాల్పుల మోత వినిపించింది. మొదట ఎలుగు బంటి వంటి అడవి జంతువులను భయపెట్టేందుకు కాల్పులు జరుపుతున్నారేమోనని అనుకున్నాం. కాల్పుల మోత ఆగకపోవడంతో ఉగ్రదాడి అని తెలిసింది. వెంటనే అప్రమత్తమై పిల్లలను మోకాళ్లపై కూర్చోమని చెప్పాను. మిగిలిన వారు కూడా అలాగే కూర్చున్నారు. పిల్లాడిని ఎత్తుకుని, మిగతావాళ్లతో కలిసి లోయ నుండి బయటకు పరిగెత్తాము. సుమారు 7 కి.మీ పరిగెత్తి పహల్గాం చేరుకున్నాం. నాపై నమ్మకంతో వచ్చిన వారిని రక్షించడం కనీస మానవత్వమని అలీ అంటున్నాడు. ఇప్పుడు అలీని ప్రతినిమిషం ఆ కుటుంబాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతో పాటు కశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ సయ్యద్ అదిల్ హుస్సేన్ షా మరణించారు.