శ్రీనగర్ : భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-44)ని మూసివేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. భారీ వర్షాలకు రాంబన్ జిల్లాలోని మార్కెట్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని, అయితే ఎవరికి ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. భారీ వర్షాలకు రాంబన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరుచుకుపడ్డాయి. కాశ్మీర్ను మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి ఇదేనని, ఉదయం 7.30 గంటల నుండి వాహనాలను నిలిపివేశామని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. సీరి, నాచ్లానాల మధ్య బురద, రాళ్లు విరిగిపడటంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయని అన్నారు. రాంబన్ పట్టణానికి సమీపంలో చంబా-సీరి నుండి పెద్ద ఎత్తున బురద ప్రవాహం ముంచెత్తిందని, పలు వాహనాలు దెబ్బతిన్నాయని అన్నారు. మే 8 నుండి 12 వరకు జమ్ముకాశ్మీర్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.
