ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముడిజూట్కు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఈఎ) 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ముడి జూట్ ఎంఎస్పి ఆమోదించింది. 2025-26 సీజన్లో రా జూట్ (టిడి-3 గ్రేడ్) ఎంఎస్పి క్వింటాల్కు రూ.5,650గా నిర్ణయించింది. ఇది మొత్తం దేశపు సగటు ఉత్పత్తి వ్యయం కంటే 66.8 శాతం రాబడిని నిర్ధారిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ఆమోదించబడిన ముడి జూట్ ఎంఎస్పి 2018-19 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన విధంగా కనీసం 1.5 రెట్లు ఆల్ ఇండియా వెయిటెడ్ సగటు ఉత్పత్తి వ్యయం స్థాయిలో ఎంఎస్పిని నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా ఉంది.
మార్కెటింగ్ సీజన్ 2025-26 కోసం ముడి జూట్ ఎంఎస్పి గత మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్కు రూ.315 పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 2014-15లో క్వింటాల్కు రూ.2400కి చెందిన ముడి జనపనార ఎంఎస్పిని 2025-26లో రూ.5,650కి పెంచింది. క్వింటాల్కు రూ. 3,250 (2.35 రెట్లు) పెరిగిందని తెలిపింది. 2014-15 నుండి 2024-25 మధ్య కాలంలో జనపనార సాగు చేసే రైతులకు చెల్లించిన ఎంఎస్పి మొత్తం రూ. 1,300 కోట్లు కాగా, 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో చెల్లించిన మొత్తం రూ. 441 కోట్లని పేర్కొంది. 40 లక్షల వ్యవసాయ కుటుంబాల జీవనోపాధి ప్రత్యక్షంగా, పరోక్షంగా జూట్ పరిశ్రమపై ఆధారపడి ఉంది. దాదాపు 4 లక్షల మంది కార్మికులు జూట్ మిల్లుల్లో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్నారు, జూట్ వ్యాపారం చేస్తున్నారు. గతేడాది 1.70 లక్షల మంది రైతుల నుంచి జనపనారను కొనుగోలు చేశారు. జనపనార రైతులలో 82 శాతం పశ్చిమ బెంగాల్కు చెందినవారు కాగా మిగిలిన అస్సాం. బీహార్లు జూట్ ఉత్పత్తిలో 9 శాతం వాటా కలిగి ఉన్నారు. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జెసిఐ) ప్రైస్ సపోర్టు కార్యకలాపాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. అటువంటి కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ (2021-24) కింద సాధించిన విజయాల గురించి కేంద్ర మంత్రివర్గం వివరించింది. దేశ ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది.