న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాద బాధితుల కోసం తాజాగా ఓ కీలక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులు ఉచితంగా (నగదు రహిత) చికిత్స తీసుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గరిష్టంగా చికిత్స ఖర్చు 1.50 లక్షలకే ఈ పథకం పరిమితం. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులు సమాచారాన్ని అందిస్తేనే ఈ పథకం కింద బాధితులు చికిత్స తీసుకునే అవకాశం ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించినున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాను అందిస్తామని గడ్కరీ తెలిపారు.
కాగా, మంగళవారం పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి గడ్కరీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారు. అందులో 30 వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మరణించారు. మతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సుగల వారే ఉండటం బాధాకరం. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల పది వేల మంది పిల్లలు చనిపోయారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపడం వల్ల మూడు వేల మంది మరణించారని’ ఆయన అన్నారు.