ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని.. నాలుగు కోట్ల బహుమతిని అందుకోనున్న వినేశ్‌ ఫోగట్‌

Apr 11,2025 15:52 #Haryana, #Vinesh Phogat

హర్యానా : ప్రముఖ భారత రెజ్లర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినేశ్‌ ఫోగట్‌కి హర్యానా ప్రభుత్వం రెండు ఆఫర్‌లను ఇచ్చింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆమె ప్రదర్శనకు గౌరవ సూచికగా హర్యానా ప్రభుత్వం గ్రూప్‌ ఎ ప్రభుత్వ ఉద్యోగం కానీ, నగదు బహుమతి కానీ, నివాస స్థలం వంటివి ఆఫర్‌ చేసింది. అయితే వినేశ్‌ ఫోగట్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులకుని.. నాలుగు కోట్ల రూపాయల నగదు బహుమతిని ఎంచుకున్నారు. ఈ రివార్డులను హర్యానా షెహ్రీ వికాస్‌ ప్రాధికార్‌ కింద వినేశ్‌కి అందించనున్నారు. హర్యానా క్రీడా విధానం ప్రకారం టాప్‌ అథ్లెట్లకు డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి పదవిని ఇవ్వనుంది.
కాగా, రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్‌ రజత పతక విజేతకు సమానమైన 30 ఏళ్ల ప్రయోజనాలను వినేశ్‌ ఫోగట్‌కి అందించాలని హర్యానా మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్‌ సైనీ ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు. ఆ రాష్ట్ర సిఎం ప్రకటనతో వినేశ్‌ ఫోగట్‌ నగదు బహుతిని అందుకునే తన నిర్ణయాన్ని మంగళవారం క్రీడా విభాగానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వినేశ్‌ ఫోగట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. కానీ కేవలం ఒక గంట ముందు ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె రెజ్లింగ్‌కి గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జులానా సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

➡️