కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి : బృందాకరత్
రాజ్యాంగ విరుద్ధం : డి.రాజా
కర్ణాటకలో కులమతాలకు అతీతంగా భారీ నిరసన
బెంగళూరు : ఒక మత విశ్వాసాలను దెబ్బతీసేలా కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టం 2025పై తాజాగా కర్ణాటకలోని కల్బుర్గీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్బి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుల, మత, సిద్ధాంతాలు, పారీలతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. పౌర సంఘాలు, దళిత సంస్థలు, హిందూ, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ మతాలకు చెందిన నేతలు, మత పెద్దలు సైతం ఇందులో పాలుపంచుకున్నారు కేంద్రం చర్యలపై తీవ్రంగా స్పందించారు. మోడీ సర్కారు తీరును తప్పుబడుతూ అసమ్మతిని తెలిపారు. కమలం పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేంగా తమ ఐక్యతను ప్రదర్శించారు. దేశంలో మైనారిటీ హక్కుల రక్షణలో భాగంగా సర్వమత ఐక్యతకు ఇది ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది.
పీర్ బంగాలి మైదానంలో దాదాపు ఆరు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. వేలాది మంది ముస్లిములతోపాటు అన్ని మతాల వారు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను నిరసించారు. వక్ఫ్ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా, వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణను పెంచేలా కొత్త చట్టం వీలు కల్పిస్తుందని యావత్ ముస్లిం సమాజంతో పాటు మేధావులు, నిపుణులు, విపక్ష నేతల నుంచి ఇప్పటికే అనేక ఆందోళనలు వ్యక్తమైన విషయం విదితమే.
తీవ్ర ప్రమాదంలో లౌకికవాదం : డి. రాజా
వక్ఫ్ చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణలను సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా వ్యతిరేకించారు. దానిని రాజ్యంగ విరుద్ధం, మైనారిటీ వ్యతిరేకమని ఖండించారు. వక్ఫ్ చట్టం సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ” భారత్ను దైవపరిపాలనా రాజ్యంగా మార్చాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్పై ఒత్తిడి చేశారు. ఆయన లౌకికవాదం వైపు దృఢంగా నిలబడ్డారు. నేడు, ఆ లౌకికవాదం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నది. ఈ చట్టం మన రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది. భారత్ను, రాజ్యాంగాన్ని కాపాడటానికి.. ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని మనం తొలగించాలి” అని రాజా అన్నారు.
ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాలు మౌనం
పహల్గాం ఉగ్రదాడిలో బాధితులకు నివాళులర్పించేందుకు ఈ కార్యక్రమం రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ కార్యక్రమానికి కర్నాటక రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మెన్, దర్గా హజ్రత్ ఖ్వాజా బందనవాజ్కు చెందిన సజ్జాదా నషిన్, హఫీజ్ సయ్యద్ ముహమ్మద్ అలీ అల్ హుస్సేని అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రి ప్రకాశ్ పాటిల్, రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నసీర్ హుస్సేన్, కలబురగి ఉత్తర ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా, ఎఐఎంపిఎల్బి సభ్యుడు మౌలానా అబూ తాలిబ్ రహ్మానీ, ఇల్కల్లోని చిత్తరాగి సంస్థాన్ మఠాధిపతి గురు మహంత్ స్వామీజీ, జామియా నిజామియా వైస్ ప్రిన్సిపాల ముఫ్తీ సయ్యద్ జియావుద్దీన్, సిక్కు సంఘం నాయకుడు గుర్మిత్ సింగ్ సలూజా, గుర్మిత్కల్లోని ఖాసా మఠాధిపతి శాంతవీర స్వామి, ఎస్డిపిఐ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మాజీద్, బీదర్లోని అనదూర్ బుద్ధ విహారానికి చెందిన భంటే వరజ్యోతి థెరోతో పాటు కేంద్ర మాజీ మంత్రి సిఎం ఇబ్రహీం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న చట్టం : బృందా కరత్
జమ్ముకాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించటంతో సహా పలు ఉద్వేగభరితమైన ప్రసంగాలు, గంభీరమైన క్షణాలు ఈ కార్యక్రమంలో కనిపించాయి. సభలో సిపిఎం పొలిట్బ్యూరో మాజీ సభ్యులు బృందాకరత్ పాల్గొన్నారు. ముస్లింలదే కాకుండా రైతులు, ఆదివాసీలు, పేదలకు చెందిన భూమిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకునే చర్యగా వక్ఫ్ చట్టం సవరణను ఆమె అభివర్ణించారు. ”ప్రభుత్వ చర్య వక్ఫ్ ఆస్తుల గురించి మాత్రమే కాదు. సరైన పట్టాలు లేని ఆదివాసీల వంటి లక్షలాది మంది నుంచి భూమిని లాక్కోవటానికి ఇది కుట్ర. మూడు వేల సంవత్సరాల నాటి రికార్డులు లేనందున వక్ఫ్ భూములను ప్రశ్నిస్తే.. భూమిలేని పేదల సంగతేంటి? కేంద్రం చర్యలను వ్యతిరేకించేందుకు మనమంతా ఐక్యంగా నిలబడాలి” అని ఆమె అన్నారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ఉల్లంఘన అని తెలిపారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.