భద్రతా వైఫల్యాల బాధ్యత ఎవరిది?

  • అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల ప్రశ్న
  • పహల్గాంలో ఉగ్రదాడి మృతులకు సంతాపం
  • ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్రానికి ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా వైఫల్యాల బాధ్యత ఎవరిదని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. భద్రతా లోపానికి గల కారణాలేంటో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అదే విధంగా ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతునిస్తున్నట్టు స్పష్టం చేశాయి. గురువారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో పహల్గాం ఉగ్రదాడిపై అఖిల పక్ష సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. తొలుత పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన అమాయక ప్రజలకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సమావేశానంతరం ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయని, అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతునిచ్చాయని అన్నారు. ఆప్‌ ఎంపీ సంజరు సింగ్‌ మాట్లాడుతూ ”దేశం మొత్తం ఈ ఘటనపై కోపంగా, విచారంగా ఉంది. దేశం, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులకు వారి భాషలో తగిన సమాధానం ఇవ్వాలని కోరుకుంటోంది. వారు అమాయక ప్రజలను చంపిన విధంగా వారి శిబిరాలను నాశనం చేయాలి. పాకిస్తాన్‌పై కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన ఏప్రిల్‌ 22న జరిగింది. ఏప్రిల్‌ 20న భద్రతా సంస్థల సమాచారం లేని ఆ స్థలాన్ని తెరిచారు. భద్రతా సంస్థలకు ఎటువంటి సమాచారం లేదు. జవాబుదారీ ఎవరనేది నిర్థారించాలి. భద్రతా లోపం ఎందుకు జరిగిందో చర్య తీసుకోవాలని మేము డిమాండ్‌ చేశాం” అని అన్నారు.

సిపిఎం ఎంపి బికాష్‌ రంజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిస్తుందని, అయితే తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని అన్నారు. ఉగ్రవాద దాడి జరిగిన స్థానంలో ఒక్క భద్రతా సిబ్బంది లేకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఇలా అనేక భద్రతాపరమైన సందేహాలు ఉన్నాయని తెలిపారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పుల్వామా దాడికి సంబంధించిన రిపోర్టు ఎక్కడుంది? దాని గురించి ఎవరికీ తెలియదు. దాని నుంచి ప్రభుత్వం ఎటువంటి గుణపాఠం నేర్చుకుంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వం జింగోయిజాన్ని ఆపాలని సూచించారు. అలాగే దాడి జరిగిన తరువాత జమ్మూకాశ్మీర్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ముక్తకంఠంతో ఖండించారని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారని తెలిపారు. కానీ కాశ్మీర్‌ ప్రజలకు వ్యతిరేకంగా కొంత మంది ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. దోషులను న్యాయస్థానం ముందుంచాలన్నారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ ”పహల్గాంలో జరిగిన ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సిసిఎస్‌్‌) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఈ సంఘటన చాలా విచారకరం. దీని కారణంగా దేశంలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది” అని అన్నారు. ఈ ఘటన కాశ్మీర్‌లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసిందని, అందరూ దీనిపై తమ ఆందోళనను వ్యక్తం చేశారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను స్పష్టం చేశాయని, దేశం ఐక్యంగా నిలబడాలని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలనే ఏకాభిప్రాయం అన్ని రాజకీయ పార్టీల్లో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఎస్‌ జైశంకర్‌, నిర్మలా సీతారామన్‌, కిరణ్‌ రిజిజుతో పాటు బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, డిఎంకె ఎంపి తిరుచ్చి శివ, సిపిఎం ఎంపి బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, ఎన్‌సిపి ఎంపి ప్రఫుల్‌ పటేల్‌, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపి సుప్రియా సూలే, ఎస్‌పి ఎంపి రామ్‌ గోపాల్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపి సంజరు సింగ్‌, ఆర్‌జెడి ఎంపి ప్రేమ్‌ చంద్‌ గుప్తా, టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వైసిపి ఎంపి పివి మిధున్‌ రెడ్డి, తృణమూల్‌ ఎంపి సుదీప్‌ బందోపాధ్యాయ, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ, బిజెడి ఎంపీ సస్మిత్‌ పాత్ర, శివసేన (షిండే) ఎంపి శ్రీకాంత్‌ షిండే తదితరులు పాల్గొన్నారు.

భద్రతా లోపాలపై ప్రభుత్వం అంగీకారం

ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నేతలతో సీనియర్‌ కేంద్ర మంత్రి పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ”ఏమీ తప్పు జరగకపోతే, మనం ఇక్కడ ఎందుకు కూర్చోంటాం? మనం కనుగొనాల్సిన చోట లోపాలు ఉన్నాయి. భద్రతా వైఫల్యానికి కారణాలు తెలుసుకోవాలి” అని కేంద్ర మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తరువాత ప్రతిపక్ష నాయకులకు వివరించడానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అనేక ప్రతిపక్ష పార్టీల నేతలు భద్రతా ప్రోటోకాల్‌ల వైఫల్యం గురించి ప్రశ్నలు అడిగారు. ”భద్రతా దళాలు ఎక్కడ ఉన్నాయి? సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఎక్కడ ఉంది?” అని పలువురు నాయకులు అడిగారని వర్గాలు తెలిపాయి. దీనికి ప్రతి స్పందిస్తూ సీనియర్‌ కేంద్ర మంత్రి అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గామ్‌ సమీపంలోని బైసరన్‌ ప్రాంతాన్ని తెరవడానికి ముందు స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఇది సాంప్రదాయకంగా జూన్‌లో అమర్‌నాథ్‌ యాత్ర వరకు పరిమితం చేయబడిందని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఆలస్యంగా స్పందించడంపై కూడా ప్రతిపక్ష నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీనికి స్పందిస్తూ ఆ ప్రదేశం 45 నిమిషాల ఎత్తుపైకి నడిచే దూరంలో ఉందని, అటువంటి అత్యవసర పరిస్థితులను త్వరగా నిర్వహించడానికి ఎటువంటి ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానం (ఎస్‌ఒపి) అమలులో లేదని ప్రభుత్వ అధికారులు వివరించారు.

➡️