సిందూర్ ఆపరేషన్‌తో పహల్గాం బాధితులకు న్యాయం : వింగ్‌ కమాండర్‌

న్యూఢిల్లీ :   పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, వారికుటుంబాలకు న్యాయం చేసేందుకు ఆపరేషన్‌ సిందూర్  చేపట్టినట్లు వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా దాడి జరిపామని అన్నారు. పౌరులకు, మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఆ ప్రదేశాలను ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషీలు కూడా పాల్గొన్నారు.

ఉగ్రవాద శిబిరాలపై దాడి  వీడియోలను కల్నల్‌ సోఫియా ఖురేషీ మీడియాకు విడుదల చేశారు.  2008 ముంబయి ఉగ్రదాడులకు పాల్పడిన డేవిడ్‌ హెడ్లీ, అజ్మల్‌ కసబ్‌ శిక్షణ పొందిన మురుడ్కే నగరం కూడా ఉంది. మురుడ్కేలతో పాటు సియాల్‌ కోట్‌లోని సర్జల్‌ క్యాంప్‌, బర్నాలా మరియు మర్కజ్‌ అబ్బాస్‌లోని మర్కజ్‌ అహ్లె హదీత్‌, కొట్లి, మెహమూనా జోయాల శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు కల్నల్‌ తెలిపారు.

జమ్ముకాశ్మీర్‌లో శాంతియుత వాతావరణాన్ని తిరిగి  దెబ్బతీసే లక్ష్యంతో పహల్గాంపై దాడి జరిగిందని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. పహల్గాం దాడి అత్యంత క్రూరమైనదని, బాధితులలో ఎక్కువ మందిని చాలా దగ్గరగా, వారి కుటుంబసభ్యుల ఎదుట తలపై కాల్చిచంపారని అన్నారు.  ఉద్దేశపూర్వక హత్యతో కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కాశ్మీర్‌లో సాధారణ స్థితిని తిరిగి దెబ్బతీయడమే ఈ దాడి లక్ష్యమని అన్నారు. భారత నిఘా సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. భారత్‌లో మరిన్ని దాడులు జరగనున్నాయని నిఘావర్గాలు సూచించాయని, దీంతో సరిహద్దు ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత్‌ ప్రతిస్పందించే హక్కును వినియోగించుకుందని  విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు. దాడులు తీవ్ర తరం కావని,  బాధ్యతాయుతంగా ఉన్నాయని అన్నారు. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను కూల్చివేయడంపై దృష్టిసారించామని అన్నారు.

➡️