కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ : కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలు ప్రజాసేవకోసం పనిచేయాలని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఆదివారం న్యూఢిల్లీలోని ఫిరోజ్షా రోడ్లోని తన నివాసంలో కొత్తగా ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశం తర్వాత తాజా మాజీ సీఎం అతిశీ విలేకరులతో మాట్లాడుతూ.. ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాగే బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యేలా చూస్తామన్నారు. పదేండ్ల ఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత సేవలు, ఇతర సౌకర్యాలను బీజేపీ నిలిపివేయకుండా తమ ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా పనిచేస్తారని వివరించారు. ఆప్ శాసనసభా పార్టీ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడిని నామినేట్ చేస్తామని అతిశీ చెప్పారు.