ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తన ఆరోగ్యం రోజురోజుకూ మరింత మెరుగవుతోందనీ, మానసికంగా, శారీరకంగా తాను బాగానే ఉన్నానని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వైద్యుల సూచనల మేరకు తనను చూసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులను కలవలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇది కొంత ఇబ్బందికరమేనని తెలిపారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి… పార్టీకి సంబంధించిన సాధారణ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటానని తెలిపారు. ఆదివారం సాయంత్రం సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పి.ప్రభాకర్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు ఎఐజి ఆస్పత్రిలో తమ్మినేనిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు నవతెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ ఆనందాచారి, న్యూస్ ఎడిటర్ రాంపల్లి రమేశ్, బోర్డు సభ్యులు కెఎన్ హరి, వేణుమాధవ్, బసవపున్నయ్య, బివిఎన్ పద్మరాజు, అనంతోజు మోహనకృష్ణ, అజరు తమ్మినేనిని పరామర్శించేందుకు ఎఐజి ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో వైద్యుల సూచనల మేరకు వారు ఆయన్ను కలవలేక పోయారు. ఈ విషయం తెలుసుకున్న తమ్మినేనిపై విధంగా స్పందించారు.
