బీసీల అభివృద్ధే లక్ష్యం.. బీసీ డిక్లరేషన్‌ విడుదల చేసిన చంద్రబాబు, పవన్‌

Mar 5,2024 20:54 #bc jayaho sabha, #Mangalagiri

మంగళగిరి: బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టిడిపి-జనసేన ప్రకటించాయి. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ ‘ సభలో ఈమేరకు చంద్రబాబు, పవన్‌ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ..బీసీల దశ.. దిశ మార్చడం కోసమే డిక్లరేషన్‌ ప్రకటించామన్నారు. ”40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టిడిపి. బీసీ డిక్లరేషన్‌ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని డిక్లరేషన్‌ ప్రకటించాం. బీసీల డీఎన్‌ఏలోనే టిడిపి ఉంది. జగన్‌ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ తగ్గించారు. దీని వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారు. ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్‌ పదవులు ఇస్తాం. చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టి, వారి ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేయాల్సిన అవసరముంది. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10లక్షలు ఇస్తాం” అని ప్రకటించారు.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ..జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారన్నారు. మంగళగిరిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్‌ సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలకు ఏటా రూ.15వేల కోట్లు కేటాయిస్తామని జగన్‌ మోసం చేశారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, ఇసుక రీచ్‌లు ఒక కంపెనీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. 153 బీసీ కులాల అభివృద్ధికి జనసేన అండగా ఉంటుందని, వారిలో ఐక్యత చాలా అవసరమని పవన్‌ అన్నారు.

డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు..

  • బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను.నెలకు రూ.4వేలకు పెంపు.
  • పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు.
  • విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు.
  • చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం.
  • అన్ని సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34శాతం రిజర్వేషన్‌.
  • జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు. దామాషా ప్రకారం నిధుల కేటాయింపు.
  • సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు.
  • సబ్‌ప్లాన్‌ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు.
  • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు.
  • చట్టబద్ధంగా కులగణన నిర్వహించి, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
  • గురుకులాలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌.
  • ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.
  • రూ.5వేల కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.
  • పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం పునరుద్ధరిస్తాం.
  • తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో-ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తాం.
  • నియోజకవర్గ లేదా మండల కేంద్రాల్లో కామన్‌ వర్క్‌ షెడ్స్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తాం.
➡️