మహిళా సాధికారతే సీఎం జగన్‌ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన

తాడెపల్లి: సీఎం జగన్‌ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివఅద్ధి చెందుతుందని చెప్పారు. ఫిబ్రవరి 16వ తేదీన నాల్గవ విడత చేయూత పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు. 26,98,931 మందికి 5వేల 60 కోట్ల 4 లక్షలు చేయూత పంపిణీకి ఆమోదం లభించినట్లు చెప్పారు. చేయూత పథకంపై ప్రతిపక్షాలు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని తెలిపారు. రూ.19,188 కోట్లను నాలుగు విడతల్లో చేయూత కింద అందించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.డీఎస్సీ నిర్వహణకు 6,100 పోస్టులతో కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. 2019 నుంచి విద్యారంగంలో 14,219 పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని వెల్లడించారు. ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినేట్‌ ఆమోదం తెలిపిందని తెలిపారు. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురానున్నామని చెప్పారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

➡️