రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

Mar 6,2024 17:23 #Input Subsidy, #release

అమరావతి: ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌-2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రైతులకు అండగా ఉంటున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు తోడుగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. సచివాలయ పరిధిలోనే పంటనష్టపోయిన రైతుల లిస్ట్‌ ఉంటుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రైతులకు పరిహారం ఇస్తున్నాం.. రైతులకు నష్టం కలగకుండా రంగు మారినా ధాన్యం కొనుగోలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఖరీఫ్‌-2023లో 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా.. ఆయా మండలాల పరిధిలో 14.24 లక్షల ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువగా పంటలు కోల్పోయిన 6,59,897 మంది రైతులకు రూ. 847.22 కోట్ల పెట్టుబడి రాయితీని అందిస్తున్నాం.. మేలో కురిసిన అకాల వర్షాల వల్ల 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 1,892 మంది రైతులకు రూ. 5 కోట్లు కోత అనంతరం పంట నష్టపరిహారం ఇస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు, గాలుల వల్ల జరిగిన పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటలు కారణంగా నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ. 442.36 కోట్ల పెట్టుబడి రాయితీని ఇస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. తాజాగా జమ చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీతో కలిపి ఈ ఐదేళ్లలో 34.41 లక్షల మంది రైతులకు రూ. 3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీని వైసీపీ ప్రభుత్వం అందించింది. ఈ 57 నెలల్లో పెట్టుబడి రాయితీ కింద 22.82 లక్షల వ్యవసాయ, ఉద్యాన, పట్టు రైతుల ఖాతాలకు రూ. 1,967.02 కోట్లు నేరుగా సీఎం జగన్‌ జమ చేశారు.

➡️