గోరంట్ల మాధవ్‌కు రిమాండ్‌ పొడిగింపు

  • ముగిసిన పోలీసు కస్టడీ

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ పై దాడి చేసిన, పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో అరెస్ట్‌ అయిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ రెండు రోజుల పోలీసు కస్టడీ గురువారం ముగిసింది. పోలీసుల అంతర్గత విచారణ అనంతరం గురటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో హాజరు పర్చగా కోర్టు ఆయనకు మరో 14 రోజుల రిమాండ్‌ విధించింది. తొలుత ఈనెల 11న ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తరువాత ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి పోలీసులు పిటీషన్‌ దాఖలు చేయగా రెండు రోజుల కస్టడీకి పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఈమేరకు బుధవారం రాజమండ్రి జైలు నుంచి అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. గోరంట్ల మాధవ్‌తోపాటు ఈ కేసులో అరెస్టు అయిన మరో ఐదుగురిని కూడా విచారించారు. విచారణ అనంతరం మాధవ్‌తో సహా ఆరుగురు నిందితులను తిరిగి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు. తిరిగి మాధవ్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను రాజమండ్రి జైలుకు తరలించారు.

➡️