- ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన ఇద్దరు కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజకు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు గురువారం లేఖ రాశారు. మొగల్తూరు ఘటనలో మృతి చెందిన కడలి పావని, గుబ్బల గంగల కుటుంబంలో వివాహం కావాల్సిన పిల్లలు ఉన్నందున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. మైరుగైన వైద్యం పూర్తి ఉచితంగా అందించాలని లేఖలో కమిషనర్ను కోరారు.