సిద్దిపేట: పోలీసులమని చెప్పి యాక్సిడెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను బురిడీ కొట్టించి డబ్బులు కాజేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం ఉంటున్న ఓ మహిళా ఉద్యోగి కి కొందరు పోలీసుల మంటూ ఫోన్ చేశారు. తన కూతురికి యాక్సిడెంట్ అయిందంటూ కాల్ చేశారు. కంగారు పడ్డ ఆమె నిజమని నమ్మింది. తన కూతురు ఎలా ఉంది.. క్షేమంగా ఉందా అంటూ ప్రశ్నించింది. నీ కూతురు ప్రాణాలతో బయటపడింది. కానీ గాయాలయ్యాయి. భయపడాల్సిన పని లేదు.. కానీ దానికి ఖర్చు అవుతుంది. వైద్యం నిమిత్తం రూ.30 వేలు ఖర్చు అవుతుందని ఆ అమౌంట్ ను పంపించాలని కోరారు.
దీంతో వీరి మాటలు నిజమని నమ్మిన మహిళా ఉద్యోగి వెంటనే వారు చెప్పిన ఫోన్ పే నంబర్ కు రూ. 30వేలు పంపించింది. అయితే మళ్లీ ఆ నెంబర్ కు ఫోన్ చేయగా రిప్లై లేదు. అయితే ఆ మహిళా ఉద్యోగికి రెండో సారి కాల్ వచ్చింది. నీ కూతురుకు వైద్యం కోసం ఇంకా రూ.20వేలు అవసరమని వెంటనే డబ్బులు పంపాలని కంగారు పెట్టించారు. అయితే వీరి మాటలపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా.. ఫోన్ కట్ చేశారు. దీంతో తన కూతురుకి కాల్ చేయగా తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. అయితే ఇది ఫేక్ కాల్ అని, తాను మోసపోయానని గ్రహించిన మహిళ ఉద్యోగి పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాంటి కాల్స్ వస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఏ పోలీసులు ఆక్సిడెంట్ కు గురైన వారి పేరు చెప్పి డబ్బులు పంపమణి అడగరని క్లారిటీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
