కార్పొరేట్‌ లాభాలకోసమే 4 లేబర్‌ కోడ్లు 

  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు
  • మే 20 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
  • కనీస వేతనం 26 వేలు చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్‌

ప్రజాశక్తి-కాకినాడ : కార్మిక వ్యతిరేక 4 లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేలు చెల్లించాలని కోరుతూ మే 20 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు పిలుపునిచ్చారు. గురువారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్‌ హోమ్‌లో జరిగిన జిల్లా సదస్సును సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నరసింగరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నరసింగరావు, ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐ.ఎన్‌.టి.యు.సి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఎ.ఐ.సి.సి.టి.యు రాష్ట్ర కన్వీనర్‌ గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ వాడితో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను.. మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్‌ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి, కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రానికి ముందుగాని, తర్వాత గాని వచ్చిన కార్మిక చట్టాలు ఏవి కూడా ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాదిమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. 3 నల్ల చట్టలతో రైతులను, 4 లేబర్‌ కోడ్లలో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షోభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోడీ మతోన్మాద ఎజెండాను అమలుపరిచేందుకు, కార్పొరేట్‌ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటుందని విమర్శించారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు సమ్మెల ద్వారా కట్టడి చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్‌ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఎల్‌ఐసి సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, షేక్‌ పద్మ, నక్కెళ్ళ శ్రీను, రొంగుల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, వేణి, వెంకటలక్ష్మీ , ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాగుల రఘువులు, గరగ దుర్గారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లచ్చారావు తదితరులు పాల్గొన్నారు.

➡️