నర్సుపై అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌పై కేసు నమోదు

కందుకూరు: నర్సుపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వైద్యుని పై పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైన ఘటన పహాడిషరీఫ్‌ లో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గూడూరు స్టేజి వద్ద గల లిమ్స్‌ హాస్పిటల్‌ లో మార్కండేయులు డాక్టర్‌గా వైద్యసేవలు నిర్వహిస్తున్నాడు. లిమ్స్‌ ఆసుపత్రిలోనే అఖిలా అనే యువతి బిఎస్సి నర్సింగ్‌ రెండవ సంవత్సరం చదువుతూ నర్స్‌గా విధులు నిర్వహిస్తుంది. మంగళవారం సాయంత్రం అఖిలా ఎల్‌ బి నగర్‌ లోని బంధువుల ఇంటికి వెళ్ళడానికి కొత్తూరు బస్టాప్‌ దగ్గర నిలబడి ఉంది. ఇక డాక్టర్‌ మార్కండేయులు కూడా గూడూరు నుంచి హైదరాబాద్‌ కు బయలు దేరాడు. కొత్తూరు బస్టాప్‌ వద్ద నుంచి వెళుతున్న డాక్టర్‌కు అఖిలా బస్టాప్‌ వద్ద నిలబడి ఉండటాన్ని గమనించాడు. అఖిల వద్దకు వెళ్లిన డాక్టర్‌ కారు ఆపాడు.
ఎక్కడికి వెళుతున్నావు అంటూ డాక్టర్‌ అఖిలను అడిగాడు. అయితే అఖిలా ఎల్బీనగర్‌ వెళుతున్న అనడంతో.. నేను కూడా హైదరాబాద్‌ వెళుతున్నానని తనతో కారులో రావాలని తెలిపాడు. డాక్టర్‌ వద్దే పనిచేస్తున్నా కదా అనుకున్న అఖిలా కారులో కూర్చుంది. అయితే కారులో అఖిలతో మాట మాట కలిపాడు.. ఇమామ్‌ గుడా వద్దకు రాగానే డాక్టర్‌ మార్కండేయులు అఖిలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కంగారు పడ్డ అఖిలా చాకచక్యంతో డాక్టర్‌ తో మాటలు కలిపి బాలాపూర్‌ వద్ద దిగిన అఖిల అక్కడి నుంచి పహాడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పరుగులు పెట్టింది. పోలీసుల వద్దకు వెళ్లి డాక్టర్‌ మార్కెండయులు.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️