ద్వారకా తిరుమల : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి శేషాచలంపై ఉన్న కొందరు జ్యూస్ దుకాణాల వ్యాపారులు కాలం చెల్లిన ప్యాకెట్ల పాలతో పండ్ల రసాలు చేసి విక్రయిస్తున్నారు. చిన వెంకన్న దర్శనం కోసం బుధవారం క్షేత్రానికి వచ్చిన ఓ యాత్రికుడు జ్యూస్ తాగేందుకు శ్రీలక్ష్మీ దుర్గా బాలాజీ పేరుతో ఉన్న జ్యూస్ దుకాణానికి వెళ్లారు. నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్యాకెట్ల పాలను ఉపయోగించి జ్యూస్ చేసి ఇచ్చాడు. ఆ పాల ప్యాకెట్లు కాలం చెల్లినవిగా గుర్తించిన యాత్రికుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు తనిఖీలు చేసి, సుమారు 217 పాల ప్యాకెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని, దుకాణాన్ని సీజ్ చేసినట్లు సూపరింటెండెంట్ నరసింహరాజు తెలిపారు.
