కేటీఆర్‌ వెంట ఒక న్యాయవాది వెళ్లొచ్చు : హైకోర్టు

Jan 8,2025 14:57 #accompany KTR, #high court, #Lawyer

తెలంగాణ : ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు తన న్యాయవాది హాజరవ్వడానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ … కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. కేటీఆర్‌ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని.. వారిలో ఒకరిని కేటీఆర్‌ వెంట వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. కేటీఆర్‌తో న్యాయవాదిని అనుమతించాలని అడ్వకేట్‌ ప్రభాకర్‌ రావు వాదించారు. గతంలోనూ లాయర్‌ అనుమతికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందని ప్రభాకర్‌ రావు గుర్తు చేశారు. అవినాష్‌ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు న్యాయవాదికి అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏసీబీ తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రజనీకాంత్‌ రెడ్డి తన వాదనలు వినిపించారు. కేటీఆర్‌ వెంట న్యాయవాదిని అనుమతించొద్దంటూ వాదించారు. న్యాయవాదిని అనుమతిస్తే సమస్య ఏంటని ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాదనల అనంతరం … కేటీఆర్‌ వెంట ఒక న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

➡️