- గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు
- డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, పంచాయతీరాజ్శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టడంతోపాటు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్శాఖలో సిబ్బంది లేరనే సమస్యను అధిగమించాలన్నారు. పంచాయతీల గ్రేడ్ల విభజనపై సోమవారం మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో పాలన సులభతరంగా ఉండేందుకు, అవసరమైన సిఫార్సులు చేసేందుకు పంచాయతీరాజ్శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటవుతుందని పవన్కల్యాణ్ తెలిపారు. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై సమీక్షలో చర్చించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకుని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని ఆయన సూచించారు. సిబ్బంది నియామకంలో హెచ్చుతగ్గులు లేకుంగా గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందాలన్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఈ సమీక్షలో చర్చించారు. జిల్లాల యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లోని పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకుని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. గ్రేడ్ల ఆధారంగా పంచాయతీ, సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్, కమిషనరు శ్రీకృష్ణతేజ పాల్గొన్నారు.