2029 నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత ఇల్లు

  • 2026 మార్చి నాటికి 7.36 లక్షల ఇళ్లు
  • గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ 2029 నాటికి శాశ్వత గృహాలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ పేర్కొన్నారు. విజయవాడ ఆటోనగర్‌లో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం మల్టీ స్టేక్‌ హోల్డర్‌ హ్యాబిటాట్‌ ఫర్‌ హ్యుమానిటీ ఇండియా సహకారంతో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఎవై) కింద అమలవుతున్న పథకాలను వేగవంతం చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ జైన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7.32 లక్షల ఇళ్ల నిర్మాణాలను 2026 మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇళ్లపై సోలార్‌ రూప్‌ టాప్‌ కోసం పిఎం సూర్యఘర్‌తో కలిసి గృహాలకు శక్తి సామర్ధ్య ఉపకరణాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అజయ్ జైన్‌ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎమ్‌డి ఎం శివప్రసాద్‌, హ్యాబిటాట్‌ ఫర్‌ హ్యుమానిటీ ఇండియా జాతీయ డైరెక్టర్‌ ఆనంద్‌ బోలిమేరా, డైరెక్టర్‌ జెబాకుమార్‌, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ పద్మనాభయ్య, ఎస్‌ఇ జయరామాచారి, కృష్ణయ్య పాల్గొన్నారు.

➡️