పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల బృందం

ప్రజాశక్తి – పోలవరం : పోలవరం ప్రాజెక్టులో సోమవారం విదేశీ నిపుణుల బృందం పర్యటించింది. ఉదయమే ప్రాజెక్టుకు చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్‌ డొనెల్లీ, సీన్‌ హించ్‌ బెర్గర్‌, జియాన్‌ ఫ్రాన్కో డి సికో, డేవిడ్‌ బి పాల్‌ బృందం తొలుత ప్రాజెక్టు సమావేశపు కార్యాలయంలో జలవనరులశాఖ ఇంజనీర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ నిర్మాణ ప్రాంతంలో పనులను, ఎగువ కాఫర్‌ డ్యాం సిపేజీ నివారణకు నిర్మిస్తున్న బట్రస్‌ డ్యాం పనులను బృందం సభ్యులు పరిశీలించారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనుల్లో భూమి పటిష్టత కోసం జరుగుతున్న పనుల తీరు, ఎగువ కాఫర్‌ డ్యాం, సిపేజ్‌ నివారణకు చేపట్టిన బట్రస్‌ డ్యాం నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎగువ కాఫర్‌ డ్యాం పటిష్టతకు చేపట్టిన పనులను పరిశీలించి సంబంధిత వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజక్టు సిఇ కె నరసింహమూర్తి, మెగా కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అంగర సతీష్‌బాబు, బావర్‌ కంపెనీ ప్రతినిధి హసన్‌ పనుల వివరాలను విదేశీ నిపుణుల బృందానికి తెలియజేశారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు సరబ్జెత్‌ సింగ్‌ భక్షి, రాకేష్తోతేజ, అశ్వనీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, హేమంత్‌ గౌతమ్‌, కేంద్ర మట్టి రాతి నాణ్యతా పరిశీలన కేంద్రం అధికారులు మనీష్‌ గుప్తా, లలిత్‌ కుమార్‌ సోలంకి పాల్గొన్నారు.

➡️