- సమస్యలపై వినతిపత్రం అందజేత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చాలని కోరుతూ ఎపి ఆశా వర్కర్ల యూనియన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, కోశాధికారి ఎ కమల సచివాలయంలో బుధవారం సిఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న 2361 మందిని ఆశ వర్కర్లుగా గుర్తించాలని కోరారు. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆశా వర్కర్లతో చర్చలు జరిపి అంగీకరించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ అమలు చేయాలని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ సౌకర్యం, మట్టి ఖర్చులు ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆశాల నియామకాన్ని ప్రభుత్వమే చేపట్టాలని తెలిపారు. రాజకీయ జోక్యం తగ్గించాలని కోరారు. ఎఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన వారికి ఎఎన్ఎం, హెల్త్ సెక్రటరీ, స్టాఫ్ నర్స్ నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని కోరారు.