ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధానం వేగవంతం

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌లో మరిన్ని సేవలు
  • ఆర్‌టిజిఎస్‌ సమీక్షలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్‌టిజిఎస్‌)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. అన్ని శాఖల మధ్య డేటాను ఆర్‌టిజిఎస్‌తో అనుసంధానం చేసే పనుల్లో మరింత వేగం పెరగాలని సూచించారు. డేటా మొత్తం ఒకచోటుకు చేర్చి డేటాలేక్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు వీలుంటుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డీప్‌ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించుకుని డేటాను విశ్లేషించుకుని ఆయా శాఖల పనితీరు మెరుగుపరుచుకోవడానికి దోహదపడేలా ఆర్‌టిజిఎస్‌ సాంకేతిక సహకారం అందించాలన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు సులభంగా సేవలు అందించగలమని, ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు అదనంగా ఏమేమి సేవలు అందించగలమో పరిశీలించాలని అధికారులకు సిఎం సూచించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగించేవారికి సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలన్నారు.

శాంతి భద్రతల పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

శాంతి భద్రతల పర్యవేక్షణకు సిసి కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను ఉపయోగించుకోవాలని సిఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,770 సిసి కెమెరాలు వినియోగంలో ఉన్నాయన్నారు. నేరస్తులను గుర్తించేందుకు సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారికి అలర్ట్‌ మెసేజ్‌ వెళ్లి, నేరస్తులను పట్టుకునేందుకు సిసి కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపైనా ముందుగానే నిఘా పెట్టి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌టిజిఎస్‌ సిఇఒ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను విస్తృతంగా వినియోగించుకోవడానికి గుగూల్‌ సంస్థ సహకారం అందిస్తోందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా, సిఎం కార్యదర్శి పిఎస్‌ ప్రద్యుమ్న, సమాచార, పౌరసంబంధాలశాఖ సంచాలకులు హిమాన్షుశుక్లా, జిఎస్‌డబ్ల్యుఎస్‌శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️