- కెవిపిఎస్ ఆధ్వర్యాన అర్ధనగ ప్రదర్శన
ప్రజాశక్తి – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం అర్ధవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్ నాయకుడు కట్టూరి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ మండల కార్యదర్శి చిన్నం చిననాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అల్లకల్లోలం సృష్టించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై రాష్ట్ర ప్రభుత్వం శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా కాకుండా మతప్రచారకుడిగా ఎమ్మెల్యే వ్యవహరించడం మంచిదికాదన్నారు. అంబేద్కర్ ఇండియన్ మిషన్ మండల నాయకులు బళ్లారి అశోక్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ నిర్మాత ఫ్లెక్సీని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నం సుబ్బయ్య, మాదాసి జీవన్కుమార్, మోసాల శ్రీను, మాణిక్యం పాల్గొన్నారు.