- మంత్రి సత్యకుమార్ ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన ఇద్దరు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022లో జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఇద్దరు డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం చక్రధర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్ రాకేష్ ప్రభుత్వాస్పత్రిలో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోగికి శస్త్రచికిత్స చేశారు. కొన్ని రోజుల తరువాత ఆ రోగి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి మరణించాడని అతని బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణకు సంబంధించి లిఖితపూర్వక వివరణ అందజేసిన వైద్యులు, తాము మానవతా దృక్పథంతోనే ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశామని, ఇందులో తమ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని వివరణ ఇచ్చారు. అంతేకాక ఈ చర్యకు క్షమాపణ కొరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్యుల వివరణను తిరస్కరించిన మంత్రి కఠిన చర్యలకు ఆదేశించారు.