అదాని గంగవరం పోర్టు విఆర్‌ఎస్‌ కార్మికుల ఆందోళన

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : విశాఖలోని అదాని గంగవరం పోర్టు విఆర్‌ఎస్‌ కార్మికులు పోర్ట్‌ గేటు ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. తొలగించిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎస్‌ తీసుకున్న కార్మికులకు రావాల్సిన బకాయిల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని నినదించారు. రెండు గంటలపాటు గేటు ముందు ఆందోళన కొనసాగించగా యాజమాన్యం తరఫున పోర్టు హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అనిల్‌, ఇండిస్టియల్‌ రిలేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గణేష్‌ అక్కడకు చేరుకున్నారు. కార్మికులతో మాట్లాడారు. ఈ నెల 20న చర్చలు ఉంటాయని, ఆ రోజు సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఆందోళన కొనసాగుతుందని, యాజమాన్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కార్మికులు హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో పోర్టు గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

➡️