ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళల హక్కుల రక్షణ, గుర్తింపు కోసం మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో మహిళలు పాల్గొనాలని ఐద్వా రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది మహిళలను కార్మికులుగా గుర్తించాలని, వారికి పని భద్రత, కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను నిలబెట్టుకుంటేనే మహిళా శ్రామికులు తమ హక్కులను సాధించుకోగలుగుతారని తెలిపారు. కార్పొరేట్ లాభాలను రక్షించేందుకు పాలకవర్గాలు మహిళల పనిని పనిగానే గుర్తించరన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను తెవాలని ప్రయత్నిస్తోందని, ఇందుకు వ్యతిరేకంగా మే 20న దేశ వ్యాప్త సమ్మెకు యావత్ కార్మికవర్గం పిలుపునిచ్చిందన్నారు. కార్మిక సంఘాలు ఈ సమ్మెకు నేతృత్వం వహిస్తున్నాయని, రైతు, రైతు కూలీ, కౌలు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయని తెలిపారు.
