ప్రజా రాజధానిగా అమరావతి

Apr 28,2025 00:36 #AP CM Chandrababu Naidu, #maeting
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  •  పనుల పున:ప్రారంభంపై సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రానికి నవోదయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. మే 2న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా జరగనున్న రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభ కార్యక్రమంపై ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధానిని నిర్మిస్తామని సిఎం చంద్రబాబు అన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి, నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మళ్లీ పట్టాలెక్కిస్తుందన్నారు. ఏ ప్రధాని చేతుల మీదుగా అయితే శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారో, మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని ఆదేశించారు. ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతామన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్‌ అని, దీనిని ఎవరూ దెబ్బతీయలేరని తెలిపారు. సంపద సృష్టి కేంద్రంగా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ‘నాది ఆంధ్రప్రదేశ్‌-నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా నిర్మాణం ఉంటుందన్నారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని, ఇటీవల ఢిల్లీలో ఆయనతో జరిగిన భేటీలో పలు సూచనలు చేశారని చెప్పారు.

ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు

రాజధాని పనులు పున:ప్రారంభం కార్యక్రమం నిర్వహణ క్రమాన్ని, ఏర్పాట్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌ అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులకు సిఎం సూచనలు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలని తెలిపారు. భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు. రాజధాని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని, వారంతా సభకు రావాలని భావిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్‌, డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️