‘బడి మూత’ను నిరసిస్తూ… అంబేద్కర్‌కు ప్రజాసంఘాల వినతి

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ : రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడాన్ని, ప్రభుత్వ స్కూళ్లను మూసివేయడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద ‘అంబేద్కర్‌’ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. 117, 128 జిఒలను టిడిపి కూటమి ప్రభుత్వ రద్దు చేస్తామని నటించి, మారోమార్గంలో మెమోను తీసుకువచ్చి విద్యారంగాన్ని ప్రభుత్వం నాశనం చేసేందుకు సిద్ధపడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, యుటిఎఫ్‌ రాష్ట్ర నేతలు జివి రమణ, ఎస్‌ఎస్‌ నాయుడు, ముత్యాలరెడ్డి, మణికంఠ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం తదితరులు విమర్శించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యారంగం నేడు అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన గురించి ఆంధ్ర రాష్ట్రమంతా ఉపన్యాసాలు చెబుతున్న టిడిపి కూటమి నేతలు ఆయన ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వరంగ స్కూళ్లను మూతవేసేందుకు సిద్ధపడడం దారుణమన్నారు. తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని కోరారు. తిరుపతి జిల్లాలో 900కు పైగా పాఠశాలలు మూసివేయబడుతున్న పరిస్థితి అన్యాయమని, దీనిని తక్షణం మానుకోవాలని, కలెక్టర్‌ నుంచి ఎంఇఒ వరకు ఇదే పనిపై పోటీలు పడి ఒత్తిడి తెస్తున్నారని, ఇది సమంజసమైంది కాదన్నారు. ఈ వైఖరిని మానుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నేతలు పాల్గొన్నారు.

➡️