ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మనువాద, మతోన్మాదంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా బిఆర్ అంబేద్కర్ను ఎగతాళి చేసి, అహంకారపూరితంగా మాట్లాడటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర కమిటీ ఖండించింది. ప్రజలు, ప్రజాతంత్ర వాదులందరూ అమిత్ షా వ్యాఖ్యలను ఖండించాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. వ్యాఖ్యల పట్ల అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారంలోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పడం సిగ్గు చేటన్నారు. మనువాద, మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగంపైన, ప్రభుత్వరంగ సంస్థలపైన దాడి చేస్తున్నారని తెలిపారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
