శ్రీకాకుళం కలెక్టర్ ఎదుటే పెట్రోల్ పోసుకున్న బాధితురాలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వినతి పత్రాలు తీసుకుంటున్న సమయంలో ఓ వృద్ధురాలు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బాధితురాలి వివరాల మేరకు.. శ్రీకాకుళం నగరం బాకర్సాహెబ్పేటకు చెందిన లొట్టి మంగమ్మ పాత్రునివలస, బలగ రూరల్ రెవెన్యూ పరిధిలో ఉన్న వారసత్వంగా సంక్రమించిన భూముల్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తన వాటాకు వచ్చిన భూములను తనకు అప్పగించేలా చూడాలంటూ ఫిర్యాదుతో ఆమె గ్రీవెన్స్ నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి వచ్చారు. కలెక్టర్, ఇతర అధికారులు వినతులు స్వీకరిస్తున్న ప్రాంతానికి అతి సమీపంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ను తీసి ఒంటిపై పోసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశాలతో పోలీసులు ఆమెను వేరే గదిలోకి తీసుకెళ్లారు. కలెక్టర్తోపాటు అప్పటికే అక్కడున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆమెతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు లొట్టి మంగమ్మ, ఆమె కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా కోర్టు బాధితురాలి పేరిట డిక్రీ జారీ చేసినట్లు గుర్తించారు. దీనిపై మంగమ్మ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో, రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని ఆమెకు స్వాధీనం చేయలేదు. పూర్తి వివరాలను తెలుసుకున్న కలెక్టర్ శ్రీకాకుళం తహశీల్దార్ను పిలిపించారు. ఆస్తుల వివరాలు, కోర్టు ఉత్తర్వులను చదివి మంగమ్మకే స్థలాన్ని స్వాధీనం చేయాలని ఆదేశించారు. పోలీసుల సాయంతో ఆమెను ఇంటికి పంపారు.
