- నిత్యాన్నదానికి రూ.17 లక్షలు విరాళం
ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని ఆమె సందర్శించారు. తన కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి యాత్రికులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం వారితో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఇఒ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.