- బాధితులకు పునరావాసం కల్పించాలి
- ఇళ్లు కూల్చమని డిప్యూటీ స్పీకర్కు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చిందా
- ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పేదలపై యుద్దం ఆపాలి
- భీమవరం బహిరంగ సభలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- భీమవరం : ఉండి నియోజకవర్గంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయం చూపి ఇళ్లు నిర్మించి ఇవ్వని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. అన్యాయంగా పేదల ఇళ్లను కూలుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు కనీసం స్పందించలేదని, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు ఇళ్లు కూల్చాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పేదలపై యుద్ధాన్ని ఆపాలని కోరారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటిస్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ సెంటర్లో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి.గోపాలన్ అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలు నిలువ నీడలేక చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోవడం బాధాకరమన్నారు. పేదల న్యాయమైన పోరాటానికి పార్టీలకతీతంగా అంతా బాసటగా నిలవాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు, కాలువ గట్లు వెంబడి ఉన్న పేదల ఇళ్లను కూల్చేశారని, దీనికి న్యాయబద్ధత, చట్టబద్ధత ఎవరిచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే పేదలకు నిలువనీడ లేకుండా చేయడమా అని ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు పి-4 పేరుతో పేదరిక నిర్మూలన అంటుంటే, ఉండి ఎంఎల్ఎ మాత్రం పేదలనే నిర్మూలిస్తానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాద దాడులపై ప్రజలందరూ ఐక్యంగా యుద్ధం చేస్తుంటే, ఉండి నియోజకవర్గంలో మాత్రం పేదలపై బుల్డోజర్లతో యుద్ధం చేయడం అన్యాయమని అన్నారు. గౌరవ స్ధానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేదల ఇళ్లు కూలుస్తామని బహిరంగంగా ప్రకటిస్తుంటే సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ల దాడిని ఆపకపోతే సహించేదిలేదని సుప్రీంకోర్టు ఇటీవల మూడుసార్లు తీర్పు ఇచ్చిందని, అది మీకు తెలియదా? అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి పేదల ఇళ్లను కూల్చే అధికారులు భవిష్యత్లో చట్టప్రకారం శిక్షార్హులన్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజే కోర్టు, పోలీసు, అధికారిగా వ్యవహరిస్తున్నారని, అధికారులు ఆయనకు దాసోహం అంటున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న నగర్లో ఇళ్లను కూల్చిన ఎంఎల్ఎ ఇప్పుడు అల్లూరి స్వగ్రామం మోగల్లులో కూడా పేదల ఇళ్లపై దౌర్జన్యానికి దిగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణాలు ఏమిటో ముందు పరిశీలించాలని, ఎఎస్ఆర్ నగర్లో నీటి కాలుష్యంపై ఎక్కడ పరీక్షించారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టించి, ప్రత్యామ్నాయం చూపిస్తే వారే ఇల్లు ఖాళీ చేస్తారని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతను ఆపితే ఇది ముగింపు సభ అవుతుందని, లేదంటే ఇదే ఉద్యమ ప్రారంభ సభగా మారుతుందని హెచ్చరించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ పేదల ఇళ్లు కూల్చుతూ సర్దుకుపోవాలని ఎంఎల్ఎ రఘురామకృష్ణరాజు అంటున్నారని, ఆయన భూస్వామి కాబట్టి పేదల ఇబ్బందులు ఏమీ తెలీదని అన్నారు. జిల్లాలో కాలుష్యానికి కారణాలు పరిశ్రమలు తప్ప పేదల ఇళ్లు కాదని తెలిపారు. పేదల ఇళ్ల తొలగింపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూస్వాములకు దోచిపెట్టడానికే తప్ప అభివృద్ధికి కాదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి.గోపాలన్ మాట్లాడుతూ ఎంఎల్ఎ గత ఏడు నెలల్లో సుమారు 800 ఇళ్లు, రెండొందలు దుకాణాలను కూల్చివేయించారని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ గోదావరి జలాలు ఏ విధంగా కలుషితమవుతున్నాయో అనేకమంది ప్రముఖులు చెబుతున్నారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై ఎంఎల్ఎ అనుచిత వ్యాఖ్యలను సిపిఐ ఖండిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్రాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అంటే ఏమిటో అర్థం తెలియని వాళ్లు ఎంఎల్ఎ అయ్యారని ఉండిలో నిరూపణైందన్నారు. మాజీ ఎంఎల్ఎ దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని చట్టాలు చెబుతున్నాయనే విషయం ఎంఎల్ఎకు తెలియదా అని ప్రశ్నించారు. బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి ఎం.రత్నరాజు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్కుమార్ మాట్లాడుతూ పేదలపై బుల్డోజర్ల రాజకీయాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పివి.రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు సూర్యవరప్రసాద్, ఎపి బహుజన జెఎసి ఫౌండర్, చైర్మన్ తాళ్లూరి మధు మాట్లాడుతూ పర్యావరణం పేరుతో పేదల ఇళ్లు కూల్చడం అభివృద్ధా అని ప్రశ్నించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనా జోసెఫ్ మాట్లాడుతూ పేదలకు అండగా ఉండాల్సిన అధికారులు ఎంఎల్ఎకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. సభలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు మంతెన సీతారాం, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి దండు శ్రీనివాస్రాజు, ఎంసిపిఐ (యు) జిల్లా నాయకులు రాంబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.