- విభజన చట్టాన్ని సవరించండి
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి
- క్యాబినెట్లో తీర్మానం
- ఆపరేషన్ సిందూర్కు సంఘీభావం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని కేంద్ర ప్రభుత్వాని రాష్ట్ర మంత్రిమండలి కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. రాష్ట్ర విభజనచట్టం (ఎపి రీ ఆర్గనైజేషన్ యాక్ట్)లో పేర్కొన్న ‘విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని’ స్థానంలో అమరావతిని చేర్చాలని ఈ తీర్మానంలో కేంద్రాన్ని రాష్ట్ర మంత్రిమండలి కోరింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పంపనుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్కు మంత్రిమండలి సంఘీభావాన్ని ప్రకటించింది. క్యాబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాకు వివరించారు. రాష్ట్రవిభజన అనంతరం పదేళ్లు పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోందని, అనంతరం అది తెలంగాణ రాజధానిగాఉంటుందని విభజన చట్టంలో పొందుపరిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ‘విభజిత ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఉంటుంది’ అని మాత్రమే చట్టంలో పేర్కొన్నారని తెలిపారు. నూతన రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చేలా రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-5, సబ్ సెక్షన్-2లను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రిమండలి తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర కార్మిక చట్టాల కోసం…
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా రాష్ట్రంలోని చట్టాలను రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు. దీనిలో భాగంగా రాష్ట్రపతి ఆమోదం కోసం 2019లో రాష్ట్రప్రభుత్వం పంపిన పారిశ్రామిక వివాదాల( ఆంధ్రప్రదేశ్ సవరణ)బిల్లును, కేంద్రహోం మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపిన కార్మిక చట్టాలు (ఆంధ్రప్రదేశ్ నేరాల సమ్మేళనం సవరణ) బిల్లు,ఫ్యాక్టరీల (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు-2019లను ఉపసంహరిచుకుం టున్నట్లు తెలిపారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక చట్టాలకు అనుగుణంగా వీటిని రూపొందించి మరలా కేంద్రానికి పంపుతామని తెలిపారు.
సిఆర్డిఎ కమిషనర్కు రూ.1732.306 కోట్లు విలువగల నాలుగు పనుల కోసం స్వల్పధరలను ఆమోదించినట్లు తెలిపారు. ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో అమరావతి నగర అభివృద్ధి కార్యక్రమం కింద డిబివో పద్ధతిలో పనులు చేసేందుకు రూ.560.57కోట్లు, నీటి నిర్వహణ వ్యవస్థ, డిజిటల్ ట్విన్, నీటిసరఫరా కోసం రూ.494.86కోట్లు, రోడ్ల నిర్మాణం కోసం మరో రూ.593.03కోట్లు ఆమోదించామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో పెద్ద, మధ్య, చిన్న నీటిపారుదల వనరులకు సంబంధించి రూ.345.39కోట్లతో 7174 ఆపరేషన్, నిర్వహణ పనులకు ఆమోదించినట్లు చెప్పారు. నీటి వినియోగదారుల సంఘాలు అందుబాటులో లేని 7 రోజుల్లోపు రూ.10.లక్షల విలువ కంటే పైబడిన పనులకు స్వల్పకాలిక టెండర్ నోటీసును ఆహ్వానించడానికి అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనను ఆమోదించామని తెలిపారు. వాణిజ్యేతర ప్రయోజనాల కోసం నీటిపారుదల చెరువుల్లో మట్టితవ్వకం, రవాణాకు రైతులకు అనుమతించినట్లు తెలిపారు. సముద్ర చేపల వేట నిషేధ సమయంలో ఉపశమనంగా అందిస్తున్న సాయానికి ‘మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్’గా పేరును పునరుద్ధిరించామన్నారు.
నెల్లూరు భూ సేకరణ పరిహారం పెంపు
నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక హబ్ నిర్మాణం కోసం జరుపుతున్న భూసేకరణకు పరిహారాన్ని ఎకరాకు రూ.4లక్షలు పెంచామన్నారు. ఓడరేవులకు సమీపంలో ఉన్న భూములను ఎపిమారిటైం బోర్డు సేకరించిన,భవిష్యత్తులో సేకరించబోయే భూములను, ఉప్పు భూములను ఎపి పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఎపిఐఐసి)కు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపామని చెప్పారు. నెల్లూరు జిల్లా నెల్లూరు బిట్-2 గ్రామంలోని 36 ఎకరాల భూమిని భగత్సింగ్ కాలనీ నివాసితుల కోసం పట్టాలు మంజూరు చేసే సులభతర ప్రక్రియను ఆమోదించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటేడ్(ఎపిపిడిసిఎల్) సంస్థల ఆస్తులను ఎన్పిఎగా ప్రకటించకుండా ఉండేందుకు జెన్కో నుంచి రూ.650కోట్లు మధ్యకాలిక రుణం అందించేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఎపి పర్యాటక విధానం-2024-29కి అనుబంధంగా తీసుకొచ్చిన ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానినికి ఆమోదించామన్నారు. మెగా పర్యాటక ఈవెంట్ల నిర్వహణ కోసం ఎపి పర్యాటక ఆథారిటీకి రూ.78కోట్ల బడ్జెట్ను కేటాయించామన్నారు.
భూములు కేటాయింపు
వైఎస్ఆర్ జిల్లా కొండాపూర్ మండలంలోని కె బొమ్మేపల్లిగ్రామంలో 191.64 ఎకరాల భూమిని 1000మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా నెడ్క్యాప్కు కౌలు ప్రతిపాదికన ఏడాదికి ఎకరానికి రూ.31వేలు చొప్పున 46 ఏళ్లు పాటు కేటాయించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
అంబేద్కర్ కొనసీమ జిల్లా చిర్రయనం గ్రామంలో 1.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లూటస్ అక్వా ఎల్ఎల్పికి ఏడాదికి రూ.2.50లక్షల లీజు చొప్పున 15 ఏళ్లపాటు కేటాయింపు.
కర్నూలు జిల్లా బి తండ్రపాడులో 1.95 ఎకరాల భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు రూ.61,23,516ల చొప్పున భూ బదలాయింపు.
విశాఖపట్నం జిల్లాలోని అన్నవరం గ్రామంలో 18.70 ప్రభుత్వ భూములను బీచ్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎపి టూరిజం అథారిటీకి బదిలీ.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పాలర్లపల్లె గ్రామంలో 18.70 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఎపిఐఐసికి ఉచితంగా బదిలీ.