- జూన్ నుంచి స్మార్ట్ కార్డుల తరహా రేషన్కార్డులు
- మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణతో పాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు ఈ నెల 7 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం వంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం నివాసం ఉండే ప్రాంతంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందని, వారం రోజుల అనంతరం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఇ-సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ నెలలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల వివరించారు. ఇకెవైసి ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యమైందని, ఇప్పటి వరకు 94.4 శాతం మేర ఇకెవైసి పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్కార్డుల జారీకి అవకాశం కల్పించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,21,223 రైస్కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా సుమారు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. 5 సంవత్సరాల లోపు, 80 ఏళ్లు పైబడిన వారికి ఇకెవైసి చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కల్పించడంతో 6,45,765 మందికి ఇకెవైసి చేయలేదన్నారు. ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం నమోదు చేసుకున్నారన్నారు. జూన్లో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రైస్ కార్డులను జారీ చేస్తామని, ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయన్నారు. స్మార్ట్ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలూ కనిపిస్తాయని, డేటా బేస్కు ఈ కార్డును లింక్ చేయడంతో సిస్టమ్లో ఆటోమెటిక్గా డాటా కూడా అప్డేట్ అవుతుందన్నారు. అలాగే ఈ నెల 4న పడిన అకాల వర్షంతో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందని, పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 41 వేల ప్రభుత్వ పాఠశాలలకు, 4 వేల సంక్షేమ వసతి గృహాలకు పైన్ క్వాలిటీ రైస్ 25 కిలోల బ్యాగ్ల ద్వారా నెలనెలా పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనరు సౌరబ్గౌర్ పాల్గొన్నారు.