- ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డిఎ సమావేశం
- 71 సంస్థలకు 1,050 ఎకరాలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని పనులకు సిఆర్డిఎ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమరావతి పరిధిలో జరుగుతున్న వివిధ పనులకు అనుమతులిచ్చింది. మొత్తం రూ.1,732 కోట్ల విలువైన పనుల టెండర్లకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో సిఆర్డిఎ అథారిటీ 47వ సమావేశం జరిగింది. దీనిలో రూ.1,732 కోట్ల విలువైన పలు పనులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబు, ఎడిసి ఛైర్పర్సన్ లక్ష్మీపార్థసారధి, సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన అంశాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు.
అథారిటీ సమావేశంలో 21 అంశాలపై చర్చించారు. వీటిల్లో ప్రస్తుతం పిలిచిన టెండర్లకు సంబంధించి అనుమతులు, అలాగే వేర్వేరు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014-19లో అనుమతించి అనంతరం ప్రారంభించిన గెజిటెడ్ అధికారుల నివాసాల పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్లతో పిలిచిన టెండర్లను ఆమోదించారు. వాటిల్లోనే అదనపు సదుపాయాలకు రూ.193.74 కోట్లు, ఎన్జిఒల కోసం నిర్మిస్తున్న తొమ్మిది టవర్లకు రూ.506.67 కోట్లు, మరో 12 టవర్ల నిర్మాణం, సదుపాయాల కోసం రూ.517.10 కోట్లు విలువైన పనులకు అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొత్తంగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలకు సంబంధించి నాలుగు ప్యాకేజీల్లో రూ.1,732.31 కోట్ల విలువైన పనులకు అనుమతి తెలిపారు. 190 ఎంఎల్డి సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంటు ప్లాంటును రూ.560.57 కోట్లతో నిర్మించనున్నారు. దీనికి కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. దీన్ని నిర్వహణ ఐదేళ్ల పాటు కాంట్రాక్టు కంపెనీ నిర్వహించనుంది. రాజధాని గ్రామాల మొత్తానికి నీటిని కుళాయిల ద్వారా సరఫరా చేసేందుకు 15 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం రూ.494.84 కోట్లు కేటాయించారు. దీనికి కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-13)తోపాటు ఇ-15 రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. వీటిల్లో సీడ్ యాక్సెస్రోడ్డును 3.5 కిలోమీటర్లు దూరం విస్తరించాల్సి ఉంది. ఇందులోనూ 1.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్) నిర్మించనున్నారు. తాడేపల్లి వర్కుషాప్ నుండి సీతానగరం రైల్వే బ్రిడ్జి అవతల వరకూ దీన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా రూ.70 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇ-15 రహదారిని ప్రస్తుతం ఉన్నచోట నుండి 4.10 కిలోమీటర్ల దూరం విస్తరించాల్సి ఉంది. దీనికి రూ.384.78 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పనులన్నిటిపై చర్చించిన అథారిటీ అన్నిటికీ ఆమోదం తెలిపింది. అనుమతి లభించిన వాటిల్లో ఇప్పటికే చాలాచోట్ల పనులు ప్రారంభం అయ్యాయని మంత్రి మీడియాకు తెలిపారు.
లా యూనివర్సిటీకి 58 ఎకరాలు
అథారిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కూడా మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో లా యూనివర్సిటీకి 58 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు కేటాయిస్తూ అథారిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మంత్రివర్గ ఉప సంఘం అనుమతి ఇచ్చింది. దీంతోపాటు బసవతారకం కేన్సర్ ఇన్స్టిట్యూట్కు గతంలో 15 ఎకరాలు కేటాయించగా, ప్రస్తుతం అదనంగా మరో ఆరు ఎకరాలు కేటాయించారు. ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి 0.78 ఎకరాలు, రెడ్క్రాస్ సొసైటీకి రూ.0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంకు హెడ్ ఆఫీసుకు 0.40 ఎకరాలు, ఐఆర్సిటిసి హోటళ్లకు ఎకరా భూమిని కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మొత్తం ఏడు సంస్థలకు భూములు కేటాయించారు. 2014-19లో 131 సంస్థలకు భూ కేటాయింపులు జరపగా, వాటిల్లో చాలా వరకూ వెనక్కు తగ్గాయి. ప్రస్తుతం ఆయా సంస్థలతో చర్చించారు. ముందుకు వచ్చిన వాటికి భూ కేటాయింపులు జరపాలని నిర్ణయించారు.