ప్రజాశక్తి-అరకులోయ (అల్లూరి జిల్లా) : అరకులోయలో ప్రారంభమైన ‘అరకు చలి ఉత్సవ్’ కార్యక్రమం శనివారం రెండో రోజు అలరించింది. ఉత్సవ్ సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన సినీ గీతాలు ఆకట్టుకున్నాయి. పరశురాం, కృష్ణమూర్తి థింసా నృత్యాలు, శ్రీకాకుళం తప్పెటగుళ్ళు, తమిళనాడు తోడ డాన్స్, మధ్యప్రదేశ్ బ్యాండ్, కొమ్ము డాన్స్, భరతనాట్యం, సుగల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, బస్తార్ బ్యాండ్, గోండు డాన్స్, రంపచోడవరం కొమ్ము నృత్యం, విజయనగరం చెక్కభజన, మణిపూర్ డ్యాన్స్, జాంనాస్టిక్స్, ప్రకాశం జిల్లా సుభాని డాన్స్, మిరార్ డాన్స్ ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కమెడియన్లు అలరింపజేశారు.
ఉత్సవ్లో భాగంగా అరకు ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో శనివారం మొక్కలు నాటారు. పార్కుకు విళుదగల్ అని నామకరణం చేశారు. బొర్రా కేవ్ నుంచి చలి ఉత్సవ్ వేదిక వరకు సైక్లింగ్ పోటీని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎఎస్.దినేష్కుమార్ మాట్లాడుతూ.. అరకులోయ పూల బొకేలను రాష్ట్రానికి తొలి పరిచయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
