ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) : గంజాయి ముఠాను అన్నమయ్య జిల్లా మదనపల్లె రెండవ పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.5 లక్షల విలువ చేసే 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి కొండయ్యనాయుడు ఇందుకు సంబంధించిన వివరాల వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు క్రైమ్ సిఐ చంద్రశేఖర్, రెండో పట్టణ సిఐ రామచంద్ర, రూరల్ సిఐ సత్యనారాయణ, క్రైమ్ సిబ్బంది కలిసి గంజాయి సరఫరా రధారులపై డేగ కన్ను వేశారు. పట్టణంలోని చంద్రా కాలనీకి చెందిన భాగ్యమ్మ, ఆవుల శివమ్మ, ఆవుల అనిల్ గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు, పిటిఎం పోలీసుస్టేషన్లో భాగ్యమ్మపై గతంలో మూడు గంజాయి కేసులు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొస్తున్నట్లు నిందితులు తెలిపారు. వారిపై పిడి యాక్టు నమోదు చేసేందుకు ఎస్పికి సిఫారసు చేస్తామని డిఎస్పి చెప్పారు.
