ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

ఖైరతాబాద్‌: అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) డైరెక్టర్‌ జనరల్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ డాక్టర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని బెల్లవిస్టా క్యాంపస్‌లో బాధ్యతలు చేపట్టారు. 1982వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రమేష్‌కుమార్‌ ఏపీ కేడర్‌కు చెందినవారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ, తెలంగాణ గవర్నర్‌కు ముఖ్యకార్యదర్శిగా, తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, హౌసింగ్‌ శాఖల ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కూడా కొనసాగారు. ఆస్కీ కోర్ట్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా కొనసాగిన రమేశ్‌కుమార్‌ తాజాగా అదే సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

➡️