జీవవైవిధ్యంపై అవార్డులు : బయోడైవర్సిటీ చైర్మన్‌ విజయ్ కుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జీవ వైవిధ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్‌ నీలాయపాలెం విజయ్ కుమార్‌, మెంబర్‌ కార్యదర్శి పి రామకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఈ నెల 22న విజయవాడలో నిర్వహిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ప్రకృతితో సామరస్యం – స్థిరమైన అభివృద్ధి’ అనే అంశంలో అవార్డులు, బహుమానాలు అందిస్తున్నామని తెలిపారు. జీవవైవిధ్యంపై కృషి చేస్తున్న, ఎంపిక చేసిన వ్యక్తులకు వ్యక్తిగత విభాగంలో అవార్డులు అందిస్తామని చెప్పారు. ఈ అంశంపైనే విద్యార్ధులకు వ్యాస రచన, చిత్రలేఖనం, ఛాయాచిత్రాల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 22న జరిగే కార్యక్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి కేటగిరీలో వచ్చిన వ్యాసాలను పరిశీలించి బహుమతి, మెమొంటో, సర్టిఫికెట్‌ అందిస్తామని పేర్కొన్నారు. గతంలో అవార్డు గ్రహీతలుగా ఎన్నికైనవారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ వివరాలను జత చేసి 2025 Biological Diversity @gmail.com మెయిల్‌కు గానీ నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్‌ట్రీ పార్కులోని తమ కార్యాలయానికి గానీ ఈ నెల 13వ తేదీలోపు పంపాలని వెల్లడించారు.

➡️