తప్పుడు ప్రకటనలపై చర్యకు ఆయుష్‌ వైద్యులకు అధికారం

  • మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆయుర్వేద మందుల వినియోగానికి సంబంధించి తప్పుడు ప్రకటనలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వ ఆయుష్‌ వైద్యులకు అప్పగించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. డ్రగ్స్‌ అండ్‌ మేజికల్‌ రెమెడీస్‌ చట్టం (1954)లో భాగంగా ఉమ్మడి 13 జిల్లాల్లో తగు చర్యలు తీసుకునేందుకు 13 మంది ఆయుష్‌ వైద్యులకు ఈ అవకాశం కల్పించినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అల్లోపతి మందులతోపాటు సాంప్రదాయ మందుల ప్రయోజనాల విషయంలో అసత్య ప్రచారంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయుష్‌కు సంబంధించిన నిఘా విభాగాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు. ఆయుష్‌ మందులకు సంబంధించి అసత్య ప్రచారంపై చర్యలు తీసుకునే విధులను ఇప్పటివరకూ ఒక్క అధికారే నిర్వహించేవారని చెప్పారు. అవసరాల మేరకు ఈ యంత్రాంగాన్ని మరింత విస్తృతం చేయాలని న్యాయస్థానం సూచించిందన్నారు. గర్భధారణ, గర్భస్రావం, రుతుచక్ర లోపాలు, లైంగిక శక్తి తగ్గడం వంటి సమస్యలకు కొన్ని మందులు అద్భుతంగా పని చేస్తాయంటూ చేసే ప్రచారాన్ని చట్టం నిషేధించిందన్నారు. మరికొన్ని వ్యాధులకు, ఇతర వైద్య విధానాలతో వీలు కాని అద్భుత పరిష్కారాలు దొరుకుతాయంటూ చేసే ప్రకటనలపైన చర్యలు చేపట్టేందుకు చట్టం వీలు కల్పించిందన్నారు. తప్పుడు ప్రకటనలు చేసే వారికి చట్టంలో ఆరు నెలల జైలు శిక్ష లేక జరిమానా, రెండింటినీ విధించవచ్చని పేర్కొందన్నారు.

➡️